గుజరాత్ వంతెన కూలిన ఘటనలో.. బీజేపీ ఎంపీ కుటుంబీకులు 12 మంది మృతి!

  • తీగల వంతెన కూలిన ఘటనలో 141 మంది మృతి
  • బీజేపీ ఎంపీ మోహన్ భాయ్ కల్యాణ్ జీ ఇంట్లో విషాదం
  • చిన్నారులు కూడా చనిపోయారని మోహన్ భాయ్ ఆవేదన
గుజరాత్ లోని మోర్బీ నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. బ్రిటీష్ హయాంలో నిర్మించిన తీగల వంతెన నిన్న సాయంత్రం కూలిన ఘటనలో 141 మంది దుర్మరణం పాలయ్యారు. 177 మందిని రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. ఆచూకీ లేని ఇతరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఈ ప్రమాదంలో బీజేపీ రాజ్ కోట్ ఎంపీ మోహన్ భాయ్ కల్యాణ్ జీ కుందారియా కుటుంబ సభ్యులు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మోహన్ భాయ్ సోదరి తరపు బంధువులు. 

ఈ విషాదంపై మోహన్ భాయ్ మాట్లాడుతూ... ఈ ప్రమాదంలో తాను 12 మంది కుటుంబ సభ్యులను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారని కన్నీటిపర్యంతం అయ్యారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. దీనికి కారణమైన వారిని శిక్షిస్తామని చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉండటం కలచివేస్తోందని అన్నారు.

Gujarat
Bridge
Collapse
BJP MP
Family Members
Dead

More Telugu News